బొండా ఉమ దీక్షకు రాధా రంగా మిత్ర మండలి, కాపు సంఘం నేతల మద్దతు

  • విజయవాడ కేంద్రంగా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని బొండా ఉమ డిమాండ్
  • మచిలీపట్నం కేంద్రంగా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని దీక్ష
  • కొత్త జిల్లాలతో వచ్చే లాభం ఏమిటని ప్రశ్న
విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బొండా ఉమ దీక్ష చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆయన దీక్షకు దిగారు. ఆయన దీక్షకు రాధారంగా మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం జిల్లాలను విభజిస్తోందని మండిపడ్డారు. కొత్త జిల్లాలతో వచ్చే ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త జిల్లాలతో కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వస్తుందా? అని అడిగారు. జిల్లాల విభజనపై పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నా సీఎం జగన్ లో ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని... విజయవాడకు రంగా పేరు పెట్టాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. రంగా అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. తమ డిమాండ్ కు స్పందించకపోతే జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Bonda Uma
Telugudesam
Vangaveeti Ranga District
Kapu
Jagan
YSRCP

More Telugu News